జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల పట్టణాభివృద్ధి, ప్రజల ప్రజారోగ్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకురావడానికి గత 8 నెలలుగా నిరంతరం కృషి చేస్తున్నామని, ఫలితంగా స్థలం కేటాయిస్తూ క్యాబినెట్ఆమెదం తెలిపిందని పేర్కొన్నారు.
వాలాంతరి భూమి కేటాయింపు ప్రక్రియలో సాంకేతిక నిబంధనల వల్ల కొంత ఆలస్యమైందని, దీనిపై కొందరు అవగాహన లేకుండా విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. చల్గల్లో కేవీ కోసం 5 ఎకరాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం 7 ఎకరాల చొప్పున రూ.50 కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించామని, పూర్తిస్థాయి అనుమతులకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం అవసరమని చెప్పారు. పాత ఎస్పీ కార్యాలయంలో తాత్కాలికంగా నిర్వహించేందుకు అధికారులు ఆమోదించారని ఎమ్మెల్యే వెల్లడించారు.
డయాలసిస్ బెడ్ల ప్రారంభం
పాత బస్టాండ్ ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 10 డయాలసిస్ బెడ్లను మున్సిపల్ చైర్పర్సన్ సమీండ్ల వాణితో కలిసి సంజయ్ కుమార్ ప్రారంభించారు. జగిత్యాల ఆస్పత్రి 730 పడకల సామర్థ్యంతో ఉత్తర తెలంగాణలోనే ప్రధాన మెడికల్ హబ్గా ఎదుగుతోందని, నిరుపేద కిడ్నీ రోగులకు ప్రైవేట్కు ధీటుగా సింగిల్ యూజ్ విధానంలో ఉచిత డయాలసిస్ సేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షులు నందయ్య, మెడికల్ హెచ్ఓడీ సుభాష్, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
